భరతమాత కంట రక్త కన్నీరు పుట్టింది.. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ ఎర్రటి రక్తంతో తడిసి ముద్దయిపోయింది.. ఎంతో మంది కన్నీళ్లు, మరెందరో పెట్టిన ఆర్తనాదాలతో పహల్గామ్ హోరెత్తింది.. అమాయకులైన భారతీయుల ప్రాణాలు దేశ సరిహద్దులో గాలిలో కలిసిపోయాయి.. పచ్చటి చెట్లు, పలుచటి గరిక ఎర్రటి అచ్చులతో భయం పుట్టించింది.. ఈ మారణహోమానికి అడ్డుకట్ట పడేదెప్పుడు..? మతం గోడలు బద్దలు కొట్టి మనిషి మనిషిలా బతికేదెప్పుడు? ఓ భారతమా.. సేద తీరు.. శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకుని స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నావని భ్రమలో ఉండి ఇన్నాళ్లూ మౌనం వహించిన నువ్వు.. తప్పు చేశావని ఈ రోజు సంఘటనలను చూస్తే నాకు అనిపిస్తోంది.

జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాశ్మీర్ అందాలను చూసి ఆ అనుభవాలను జ్ఞాపకాలుగా మలుచుకుందామని వెళ్లిన టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి మరీ అమాయకులను నమ్మించి ప్రాణాలు తీశారు. ఫలితంగా 30 మందికి పైగా ఈ మారణహోమానికి బలయ్యారు. కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్ ఎంజాయ్ చేద్దామని వచ్చినవాళ్లు కొందరు.. వయసు పైబడి కొన్ని రోజులు సేద తీరుదామని వచ్చినవాళ్లు మరికొందరు.. ఎప్పటి నుంచో కాశ్మీర్ చూద్దామని ఆశలు పెంచుకుని, ప్లాన్ చేసుకుని వచ్చినవాళ్లు ఇంకొందరు.. కుటుంబంతో కలిసి సెలవుల్లో సరదాగా గడపాలని వచ్చి బలైనవాళ్లు ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరి మరణం వెనక ఒక్కో కన్నీటి గాథ. కశ్మీర్లోనే ఎర్రటి కుంకుమ పువ్వులు ఎందుకు పూస్తాయనే ప్రశ్నకు ఓ మహాకవి ఏం సమాధానం చెప్పాడో తెలుసా?.. అక్కడ పాకే పసిబిడ్డ నెత్తురుతో ఉన్నట్లుండి ఆ నేల తడిసి ముద్దవుతుందని. పహల్గామ్ మారణహోమంలో అసువులు బాసిన ఎందరో అమాయకులు.. అలా వాళ్లు తమ కళ్ల ముందే కన్నుమూస్తుంటే చూసి తట్టుకోలేక ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ వణుకుతూ కుటుంబ సభ్యులు.. ఒక్కొక్కరి వేదన వింటుంటే, ఆ ఘోరకలి దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయని వారు చెప్తుంటే ఉబికివస్తున్న కన్నీరు.. ఆ సమయంలో వాళ్ల నరకయాతనను చెప్పుకుంటుంటే వింటున్న నా ఒళ్లు గగుర్పొడిచింది.


కింది ఫోటోని చూశారా.. మనసు చివుక్కుమంటుంది కదూ..! ఊపిరి వదిలిన భర్త మృతదేహం పక్కనే నిస్సహాయ స్థితిలో అలా తననే చూస్తూ కూర్చుండిపోయిన ఓ మహిళ. పాపం.. కాసేపు ముందు వరకు అక్కడే సరదాగా గడిపారేమో.. ఫోటోలు తీసుకున్నారేమో.. ఏళ్ల పాటు గుర్తుండిపోయే ఊసులను అప్పటివరకు ఒకరితో ఒకరు పంచుకున్నారేమో.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.. టెర్రరిస్టుల బుల్లెట్కు బలైన తన భర్త ఉలుకుపలుకు లేకుండా ఉన్నపాటుగా కుప్పకూలి పడిపోయాడు.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు.. ఆ సంఘటనని, తన వేదనని అసలు మనం ఊహించగలమా? ఆ ఆడబిడ్డ ఐదోతనాన్ని తెచ్చివ్వగలమా?

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు.. మరెన్నో ఏళ్లు కలిసి ఒకటిగా బతకాలనుకున్నారు.. కానీ, అంతలోనే ఆ దేవుడు వేరు చేశాడు. పెళ్లయి వారమే అయింది.. హనీమూన్ పేరుతో సరదాగా కొన్ని రోజులు గడపాలని వచ్చారు.. కొత్తగా పెళ్లయిందని సంబరపడుతూ తాము మొదలుపెట్టబోయే కొత్త జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవాలని అందమైన కాశ్మీర్కు వచ్చారు.. ఇక తన కాపురం చక్కగా పడుతుందని ఆ ఆడబిడ్డ ఊహించింది.. పైగా దేశానికి సేవ చేసే, జాతి గర్వించే నేవీ అధికారిని పెళ్లి చేసుకుంది.. ఇంకేముంది.. అంతా బాగుందనే అనుకుంది.. కానీ, పెళ్లయిన వారానికే ఇంత ఘోరం చూస్తానని తను కలలో కూడా అనుకుని ఉండదు. అప్పటిదాకా తనని మురిపిస్తూ మరిపిస్తూ మెలిగిన తన భర్త ఉగ్రవాదుల రక్త దాహానికి బలయ్యాడు. అధికారిక లాంఛనాలతో ఆ నేవీ అధికారి మృతదేహాన్ని పెట్టెలో పెట్టి తీసుకువచ్చి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారందరూ గౌరవిస్తుంటే.. ఆ అమాయకురాలికి కన్నీరొక్కటే దిక్కయింది.. చివరలో భర్తకు సెల్యూట్ చేస్తూ 'జైహింద్' అని పలికిన ఆ ఆడబిడ్డ భావోద్వేగం నా కళ్ల ముందు ఇంకా కదలాడుతోంది. ఆ భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని జాలీగా కాశ్మీర్లో ఎంజాయ్ చేద్దామని వచ్చారు. ఇంతలోనే దూరంగా బుల్లెట్లు కాలుస్తున్న శబ్దాలు.. ఏం చేయాలో అర్థం కాలేదు వీళ్లకి. పైగా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు.. ఆ వైపు నుంచి ఎవరు వస్తున్నారో సరిగా కనిపించని పరిస్థితి అక్కడ. విషయం అర్ధమయ్యే లోపే.. ఓ ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులు వీళ్లను అడ్డుకున్నారు. కాళ్లతో తన్నుతూ, తుపాకులను గురిపెట్టి భయపెట్టేశారు. ఏం చేయాలో అర్థం కాక.. ఆ భర్త తన భార్యని సముదాయిస్తున్నాడు మెల్లగా. ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని అలాగే ఉండిపో అని భయంభయంగా ధైర్యం చెప్పాడు. గుండె దడదడలాడుతుండగా ఆ భార్య అలాగే కళ్లు మూసుకుని ఏమీ మాట్లాడకుండా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది. కాసేపటికి బుల్లెట్ పేలిన శబ్దం వినిపించింది.. అలాగే కళ్లు మూసుకుని ఉండిపోయిన తనకి ఇంతలో తాను వేసుకున్న డ్రెస్కి ఏదో తడి అంటినట్లుగా అనిపించింది.. అదే భయంతో మెల్లగా కళ్లు తెరిచింది.. చూస్తే అప్పటికే ఒళ్లంతా రక్తంతో ఉగ్రవాదుల రాక్షసత్వానికి ఊపిరి వదిలేసి పక్కనే పడిపోయిన తన భర్త.. ఆ క్షణంలో ఆ ఇల్లాలి బాధను కనీసం మనం ఊహించగలమా ఎంత భయంకరంగా ఉంటుందో..! తండ్రి భుజాలపై ఎక్కి ఆడుకున్న ఆ పిల్లలకు జరిగిన లోటు తీరుతుందా? పక్కనే ఉన్న వేరే మహిళ.. నా భర్తని ఎలాగో కాల్చి చంపేశారు, నన్ను కూడా కాల్చేయండని ఆ రాక్షసులకు ఎదురువెళ్తుంటే.. నువ్వు వెళ్లి ఈ విషయం మీ మోదీతో చెప్పాలి కదా.. అందుకే వదిలేస్తున్నా అని ఆ టెర్రరిస్టు అన్నాడని ఆ మహిళ గుర్తు చేసుకుంటూ పెట్టిన కంటతడి ఇంకా ఆరనే లేదు.
నీ మతమేంటి..? నువ్వు హిందువా?.. ముస్లింవా?.. పెద్ద పెద్ద తుపాకీలను తల దగ్గర నొక్కిపెట్టి, రాక్షసత్వంగా చూస్తూ టెర్రరిస్టులు ఈ ప్రశ్నలు వేస్తే ఆ సమయంలో నువ్వైతే ఏం సమాధానం చెప్తావు? మతం మీద, దేశం మీద ఉన్న అభిమానంతో నిజమే చెప్తావా?.. లేక ప్రాణాలు ముఖ్యం కదా అని అబద్దాన్ని ఎంచుకుంటావా? అయినా ఏ మతం అయితే ఏంటి..? ఏ దేవుడిని పూజిస్తే ఏంటి?.. హిందువులు కావడమే వాళ్లు చేసిన తప్పా?.. ఒక భారతీయ స్త్రీకి నుదుటన బొట్టు ఎంత ముఖ్యమో తెలుసు కదా.. దాని విలువ ఏంటో మర్చిపోలేదు కదా.. అలాంటి బొట్టుని చెరిపేయాలని, లేదంటే చంపేస్తామని టెర్రరిస్టులు బెదిరిస్తుంటే ఏ ఆడబిడ్డయినా ఏం చేస్తుంది? ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి తప్పించుకోవడానికి వేరే దారేది? మగవాళ్లందరినీ మోకాళ్ల మీద దోషుల్లా కూర్చోబెట్టి మీ మతమేంటో చెప్పండని నిలదీస్తే ఏం చెప్పగలరు పాపం..? అవసరానికి అబద్దం ఆడి తప్పించుకోవాలనుకున్నా వేసుకున్న ప్యాంటులను విప్పించి మరీ నిర్దారించుకునేంత దారుణం ఇంకోటి ఉంటుందా? ఇది మానవత్వానికే మచ్చ తెచ్చే అసహ్యకరమైన సంఘటన. ఏం.. హిందువైతే కాశ్మీర్ గాలిని పీల్చే హక్కు లేదా? ఉగ్రవాదమా.. నీకు ఇంత కర్కశత్వమా..? 
జరిగిన మారణహోమంలో ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే.. ఆడవాళ్లు కదా అని వదిలేస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగి వచ్చేసినవాళ్లు కొందరైతే, ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక బాత్రూంలలో దూరి ప్రాణాలు దక్కించుకున్నవాళ్లు మరికొందరు.. బుల్లెట్ గాయాల మరకలతో హాస్పిటల్స్లో చేరి ఊపిరికి ఊపిరిని జత చేస్తూ ఇంకా బతుకు కోసం పోరాడుతున్న వాళ్లు ఇంకొందరు.. ఆఖరికి ఇండియన్ ఆర్మీయే స్వయంగా ఆపదలో ఉన్నావాళ్లను కాపాడదామని వెళ్తే.. వీళ్లు కూడా టెర్రరిస్టులే ఏమో.. ఇలా ఆర్మీ బట్టల్లో వచ్చారేమో అని నమ్మలేని స్థితికి వెళ్లి మమ్మల్ని ఏం చేయొద్దని వేడుకున్నారంటే అక్కడ వాళ్లంతా ఎంత బాధను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.

ఇలా ఎక్కడ చూసినా, ఎవరి దీనగాథ విన్నా గుండె కరిగి, కన్నీరు కార్చే పరిస్థితులే ఇప్పటి మన భారతంలో.. మరి దీనికి అంతమేది..? ఈ నరమేధానికి అడ్డుకట్ట పడేది ఎప్పుడు..? భారతావని స్వేచ్ఛ, స్వతంత్రాలతో మొహంలో చిరునవ్వు నింపుకుని, తెల్లని పావురంలా ఆకాశంలో ఎగిరే తరుణం వచ్చేది ఎప్పుడు..? నిజంగా ఈ క్షణంలో నాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఒక పాట గుర్తుకు వస్తుంది.. "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా.. ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా.. దానికి సలాము చేద్దామా..?"
#NEEDJUSTICE
#ALLEYESONPAHALGAM
THANK YOU 🙏
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి