దేవుడు అంటే ఎవరు..? ఈ ప్రశ్న మీకెప్పుడైనా వచ్చిందా? వచ్చే ఉంటుంది.. అంతుచిక్కని ఈ ప్రశ్నకు సమాధానం మనలో ఎవరూ చెప్పలేం. దేవుడు కదా మనకేం తెలుసని గుడ్డిగా మొక్కేవాళ్లు కొందరు, చిన్నప్పటి నుంచి ఇంట్లోవాళ్ల ద్వారా చూసి అలవాటైపోయిందని మొక్కుతున్నవాళ్లు మరికొందరు, దేవుడనేవాడిని గుర్తించకపోతే మన కష్టాలు ఎలా పోతాయిరా అని మొక్కేవాళ్లు ఇంకొందరు, ఏదోలే దేవుడు కదా మొక్కకపోతే ఎలా అని సమాధానం చెప్పేవాళ్లు ఇంకా కొందరు.. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు, ఎవరికి తెలిసినంతలో వాళ్లు, ఎలా తోచినట్లు వాళ్లు ఏళ్లుగా దేవుడిని మొక్కుతూనే ఉన్నారు. మరి మీ ఉద్దేశ్యంలో దేవుడు అంటే ఏంటి? ఎప్పుడైనా మీకు మంచి జరిగి, అనుకున్నది నెరవేరి దేవుడంటే ఇది అని గుర్తించేలా ఏదైనా అనుభవం ఎదురైందా? అలాంటివి ఉంటే నాతో పంచుకోండి...
చాలా మంది అడుగుతారు.. ఏంట్రా, ఎప్పుడు టైమ్ దొరికినా గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతావు, అయినా ఈ వయసు నుంచే నీకు ఈ చాదస్తం ఏంటి అని..! నిజంగా దేవుడిని మొక్కడానికి వయసుతో సంబంధం ఉంటుందా? ఒక వయసు వచ్చాకే దేవుడిని మొక్కాలని ఏమైనా పరిమితులు ఉంటాయా? అది మన ఆలోచనల బట్టి, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం బట్టి మన జీవితానికి అలవాటుగా మారిపోతుంది. నా వరకూ అయితే.. ఏదైనా దూరప్రాంతంలో ఉన్న గుడికి వెళ్తున్నానంటే.. అక్కడికి ఎలా వెళ్తున్నా, అలా వెళ్లే క్రమంలో నాకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, పైగా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఎలాంటి కొత్త కొత్త రుచులు చూడొచ్చు, ఆ కొత్త ప్రదేశంలో ఇంకా కొత్తగా ఏం తెలుసుకోవచ్చు అనేవి పరిశీలిస్తుంటా. అందులో భాగంగానే అక్కడ ఉన్న గుడికి వెళ్లి దేవుడిని మనసారా దర్శించుకోవడం కూడా. సో.. నేను చెప్పేది ఏంటంటే.. ఈ అనుభవాల అన్నింటి కోసం నా యాత్ర ఉంటుంది తప్ప.. నేనేదో మహా భక్తుడిని అయిపోయానని కాదు.దేవుడి ముందు కళ్లు మూసుకుని కూర్చున్నావంటే నీకు పెద్ద పెద్ద శ్లోకాలు, మంత్రాలు రానక్కర్లేదు.. వేదాలు చదివి ఉండాల్సిన పని లేదు.. మనసారా కొలిస్తే చాలు.. ఎలా మొక్కినా ఆ దేవుడికి నువ్వు చెప్పేది అర్థమైపోతుంది. ఏ స్వార్థం లేకుండా నిర్మలమైన మనసుతో ఆ దేవుడిని మొక్కడమే ఆయనకు కూడా కావాల్సింది.. అదేంటి, మనం మొక్కేదే ఆ దేవుడు మన కష్టాలన్నీ పోగొట్టాలని కదా అంటావా? అలా మొక్కితేనే అన్నీ జరిగిపోతాయంటే పనులు మానేసి పూజలే చేస్తూ కూర్చుంటావుగా.. మనిషికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా ఉంచాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఎప్పుడైనా భరించలేని కష్టం వస్తే నేను నీకింత చేశాను.. కానీ, నన్ను ఇలా ఏడిపిస్తున్నావని దేవుడిని తిట్టేవాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు.. అదే సంతోషంగా ఉంచితే అంతా దేవుడి దయ అనేవాళ్లూ ఉంటారు. కర్మఫలితం అనేది ఒకటి ఉంటుంది.. దాన్ని బట్టే అన్నీ జరిగిపోతుంటాయి. అందుకే కష్టం వస్తే దేవుడిని నిందించడం మాని, ఎలాంటి పరిస్థితినైనా పూర్తి మనసుతో స్వీకరించడానికి ప్రయత్నించు.
ఇదంతా పక్కన పెడితే.. చాలా మందికి భగవద్గీత అంటే మాములుగా తెలిసే ఉంటుంది. అది ఏ సందర్భాల్లో చూస్తుంటాం ఎక్కువగా. ఇప్పుడైతే మనిషి చనిపోతే పక్కనే కూర్చుని చదవడమో, మారిన కాలాన్ని బట్టి మైక్ సెట్ పెట్టి వినిపించడమో చేస్తున్నారు. అంటే మనం పుట్టి, పెరిగి, కుటుంబాన్ని పెంచుకుని, ఇంత సంపాదించి చివరికి నువ్వు పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లట్లేదనే ఉద్దేశంతో భగవద్గీత వినిపిస్తుంటారు. మనిషి పోయాడన్న బాధలో ఏడుస్తున్న మనకు, ఆ గీతా సారాంశం వినడం మంచిదే.. కానీ, పోయిన మనిషి దగ్గర అది పెడితే ఎవరికి లాభం? పోయాక ఎంత మొత్తుకున్నా వినే పరిస్థితి ఎలాగో ఉండదు కదా. అందుకే నా దృష్టిలో భగవద్గీత అనేది మనిషి పోయాక వినిపించేది కాదు.. బతికున్నప్పుడే చదివేది.. మరో పది మందితో చదివించేది. చదివి అందులోని నీతిని, జీవిత సత్యాలను తెలుసుకోవడం లాంటిది, మనిషిగా మనం ఈ భూమి మీదికి ఎందుకు వచ్చామో, ఈ పుట్టుక ఎందుకో గుర్తించడం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే.. భగవద్గీత అంటే అదేదో మన వయసుకు సంబంధం లేని అర్థం కాని పరమార్థం కాదు.. ఇంట్లో దేవుడి గదిలో దుమ్ము పట్టేసిన ఓ పాత పుస్తకం కాదు.. మనిషిగా నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ఉపయోగపడే ఓ మార్గదర్శి.
సత్యం
రిప్లయితొలగించండివాస్తవం
Thanks
తొలగించండి